బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన ఏలూరు పోక్సో కోర్టు

  • మైనర్‌పై లైంగిక దాడి, హత్యాయత్నం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
  • నిందితుడు వడ్లమూడి బాలకృష్ణకు రూ.35,000 జరిమానా
  • 2015లో ద్వారకా తిరుమల మండలంలో జరిగిన దారుణ ఘటన
పదకొండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడికి ఏలూరు ప్రత్యేక పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నిందితుడు వడ్లమూడి బాలకృష్ణ (39)కు జీవిత ఖైదుతో పాటు రూ.35,000 జరిమానా విధిస్తూ బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి కనుగుల వాణిశ్రీ తీర్పు వెలువరించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2015 అక్టోబర్ 21న ద్వారకా తిరుమల మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు, నిందితుడు బాలకృష్ణ తొలుత బాలిక తల్లిదండ్రులపై ఇనుప రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.

తన నేరం బయటపడకుండా, సాక్ష్యాలను నాశనం చేసే ఉద్దేశంతో బాలిక కాళ్లు, చేతులు కట్టేసి, ఇంట్లోని వంట గ్యాస్ లీక్ చేసి నిప్పంటించాడు. అయితే, ఆ బాలిక మంటల నుంచి ప్రాణాలతో బయటపడి, బంధువుల ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని వివరించింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

దీనిపై పోక్సో, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చేసింది. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు ద్వారా కోర్టు స్పష్టం చేసింది.                                

Vadlamudi Balakrishna
Eluru POCSO Court
Life Imprisonment Verdict
Andhra Pradesh Crime News
Dwaraka Tirumala Case
POCSO Act Sentence

More Telugu News